(దండుగుల శ్రీనివాస్)
బీఆరెస్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత అండ్ టీమ్ స్పందించినంతగా ఎవరూ స్పందించడం లేదు. సీఎం అన్నారు మీరెట్లా జాతిపితవుతరని. అంత వైరల్ అవుతోంది. కానీ కవిత టీమ్ మాత్రం కేసీఆర్ను వదలడం లేదు. ఆమెను లిక్కర్ కేసులో అక్రమంగా జైలుకు పంపిన రోజులను వారు మరిచిపోలేదు. ఆమే మరవలేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతీసారి ఆమె తన విశ్వరూపాన్నిచూపుతూ వస్తున్నది. తాజాగా ఆమె కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన అంశాన్ని సమర్థించింది. ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే… నేను ఎదుర్కోలేదా? అని స్పష్టం చేసింది.
దీనిపై ఆ పార్టీ నేత క్రిశాంక్ ఓ ట్వీట్ చేశాడు. ఐదు నెలల క్రితం కాళేశ్వరం విషయంలో నోటీసులిస్తే.. నిరసన తెలిపిన కవితక్క… బంద్కు ఎందుకు పిలుపునివ్వలే అని కేటీఆర్ను నిలదీసిన కవితక్క.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు సర్కార్ చర్యలను సమర్థిస్తున్నది..? అని. కానీ ఇక్కడ క్రిశాంక్ ఒక్కటి మరిచాడు. ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బరాబర్ చెప్పింది. దీనికి ఆద్యుడు హరీశ్రావు అని కూడా తేల్చిపారేసింది. ఇక నిరసనలు, బంద్లకు పిలుపు అనే విషయంలో కేటీఆర్ చేయాల్సిన పనిని గుర్తు చేసింది. అంతే. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆమె క్లారిటీగానే ఉన్నది. బాజాప్తా చెప్పింది కూడా.. నా భర్త ఫోన్నే ట్యాప్ చేశారు.. మీరు మనుషులేనారా? అని తిట్టినా ఇంకా సిగ్గు రాలేదు. ఇప్పుడు దీనిపై కేసీఆర్ను విచారిస్తున్నారంటే.. తప్పు.. అది కేసీఆర్కు సంబంధమే లేదు అనగలదా? ఆద్యుడు ఆయనేని అందరికీ తెలుసు. కవితకూ తెలుసు.

ఇక అసలు విషయానికొద్దాం.. కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు ఆయనను విచారించేందుకు వచ్చిన సమయంలో అంతా మూకుమ్మడిగా రోడ్డెక్కారు. కేటీఆర్ అండ్ టీమ్..మాజీ మంత్రులు, సీనియర్లు.. అంతా అంతా. మరి లిక్కర్ కేసులో ఆమెను జైలుకు పంపేటప్పుడు, పంపినప్పుడు ఈ టీమ్ స్పిరిట్ ఎక్కడికి పోయింది? ఇది నేనడం లేదు. కవిత అండ్ టీమే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నది. నిలదీస్తున్నది. మీరు మంచి ఫాదరే కాలేనప్పడు.. మిమ్మల్ని ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఎట్లా అంటం.. ఎట్లా ఒప్పుకుంటం.. అని బరాబర్ కడిగేస్తున్నారు. ఇప్పుడు కవిత క్లారిటీగా ఉన్నదనిపిస్తున్నది. మొన్నటి వరకు ఆమె ఆచితూచి ఆచితూచి మాట్లాడింది. ప్రవర్తించింది. తండ్రి విషయంలో.
ఇప్పుడు ఆమె బరిగీసి నిలిచింది. తండ్రీ లేడు గిండ్రీ లేడు. అన్న లేడూ గిన్నా లేడు. అందరినీ కడిగి పారేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా మీరు జాతిపిత ఎట్లైతరు కేసీఆర్? ఇప్పుడు కవిత కూడా అంటున్నది.. ఓ బిడ్డకు మంచి తండ్రే కాలేకపోయారు. తెలంగాణ జాతిపిత ఎట్లైతరు డ్యాడీ? అని. ఇప్పుడు జనానికి కూడా క్లారిటీ వచ్చుంటది. ఉన్న ఇజ్జత్ కచరా చేసుకోవడమంటే ఇదేనేమో! కాళేశ్వరం విషయంలో ఇంత ఇమేజీ డ్యామేజీ కాలేదు కావొచ్చు. కానీ ఇక్కడ ఫోన్ అక్రమ ట్యాపింగ్ విషయంలో అయ్యింది. అక్రమ అనే పదాన్ని వాడుతున్నది మీడియా కూడా. ఎందుకంటే.. ప్రతీ సర్కార్లో ఫోన్ ట్యాపింగ్ కామనే. కానీ ఇక్కడ మితిమీరింది. హద్దులు దాటింది. శృతి మించింది. అహం తలకెక్కి అధికారం కోసం అర్రులు చారి బరితెగించింది. అందుకే ఇప్పుడు ఇలా నగ్న స్వరూపాలు బయటపడి ఉన్న ఇజ్జత్ కాస్తా కచరా అవుతోంది.

Dandugula Srinivas
Senior JOurnalist
7661066999
