వాస్తవం ప్రతినిధి – గాంధారి:
ఆ చెరువు కింద పదెకరాలకు పైగా వరి సాగవుతుంది. ఆ పొలాలకు ఆ చెరువే జీవనాధారం. పశువుల దాహార్తి తీర్చడంతో పాటు ఆ ఊరికి అన్ని అవసరాలకు తోడుగా ఉంటుంది. ఆ చెరువును ఖాళీ చేసేశారు కొందరు ఆకతాయిలు. ఆ చెరువుకున్న తూమును ఎత్తేడంతో అదిప్పుడు ఖాళీ అయిపోయింది. ఆలస్యంగా వచ్చిన ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ముధెల్లి గ్రామంలో ఉన్న ఎల్లమ్మకుంట చెరువు ఎప్పుడు నీటితో నిండి ఉండి కళకళలాడేది. ఎండాకాలంలో కూడా నీటితో ఉండే ఆ కుంట .. దానిపై ఆధారపడ్డ పొలాలకు జీవధార నందిస్తుండగా.. పశువుల దాహార్తిని తీర్చేది.
కానీ కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి వేళ కొందరు ఆకతాయిలు ఆ ఎల్లమ్మకుంటకు ఉన్న తూము రాడ్ను ఎత్తేశారు. దీంతో నీళ్లన్నీ కిందకు వెళ్లిపోయాయి. ఇప్పుడా కుంట ఖాళీగా.. ఓ చిన్న మడుగును తలపిస్తున్నది. దీనిపై గ్రామ పెద్దలు తెలిసి కూడా పట్టించుకోకపోవడం.. అధికారులకు కొందరు సమాచారం ఇచ్చినా లైట్ తీసుకోవడంతో ఇది పోలీసుల వరకు ఇంకా పోలేదు. పది మందికి ఉపయోగపడే నీటిని వృథా చేసిన ఆకతాయిలు ఇకపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
