వికారాబాద్ – వాస్తవం ప్రతినిధి:
స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ తన కూతురు రాజకీయ భవిష్యత్ కోసం తపన పడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో ఆమెను బరిలో దింపారాయాన. ఇక్కడి మున్సిపల్ చైర్ పర్సన్ సీటు ఎస్సీ మహిళకు రావడంతో ఆయన అధిష్టానాన్ని ఒప్పించి కూతురిని బరిలోకి దింపారు. మొత్తం 34 వార్డులలో ఆయన సీనియర్ నాయకులు, పార్టీ కోసం కష్టపడ్డ గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకున్నారు. ఒకటికి రెండు సార్లు సర్వేలు కూడా నిర్వహించారు. ఇక్కడ స్పీకర్ కూతురు బరిలో ఉండటంతో అందరి దృష్టి ఇక్కడి రాజకీయాలపై పడింది. ప్రతిపక్ష బీజేపీ, బీఆరెస్లు ఇక్కడ పోటీ నిచ్చేందుకు తండ్లాడుతున్నాయి.
కూతురు రాజకీయ అరంగేట్రం బ్రహ్మాండమైన విజయంతో మొదలుకావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ విశేషంగా కృషి చేస్తున్నారు. వారం రోజులుగా ఆయన వికారాబాద్లోనే తిష్టవేసి అక్కడి నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూ వస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తూ .. నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించి వారికి పదవులు ఇచ్చేందుకు హామీ ఇవ్వడంతో ఈ బల్దియా బరిలో కాంగ్రెస్ నుంచి రెబల్స్ బెడద లేకుండా చేసుకోవడంలో కృతకృత్యులయ్యారు. ఇక ప్రచార సరళే మిగిలుంది. అంతా తానై స్పీకర్ ఇక్కడ ప్రచారం కార్యక్రమం మొదలు, గల్లీ గల్లీ .. ఇల్లు, ఇల్లు చుట్టి వచ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి ఇబ్బడిముబ్బడిగా చేసి ఉన్నారు. అభివృద్ధి మంత్రంతో పాటు అందరివాడుగా ఉన్న గడ్డం ప్రసాద్ తన కూతురును ఆశీర్వదించాలని కోరుతున్నారు.
